రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఏర్పాట్లు, నిర్వహిస్తున్న సమావేశాలపై జిల్లాకు చెందిన ఓ ఎంపీ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ను రాహుల్గాంధీతో పోలుస్తున్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ లేదని, పార్టీ నిబంధనలను ఉల్లంఘించి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రావడం సరికాదని ఆ ఎంపీ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. జగన్ ఏదో ప్రారంభోత్సవానికి జిల్లాకు వస్తుంటే ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన, పనిచేస్తున్న నాయకులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమవడం దురదృష్టకరమని అంతకుముందే సదరు ఎంపీ కాకినాడ సమావేశంలో తన మనసులో మాట బయటపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. జగన్ యువసేన అంటే పార్టీకి అనుబంధ సంస్థ కాదని, అలాంటిది జిల్లాలో జగన్ పర్యటనకు కాంగ్రెస్ నేతలు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటూ ఆ ఎంపీ వ్యాఖ్యానించినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనేందుకు మార్గం సుగమమైనందునే జిల్లాలో 65 కిలోమీటర్ల మేర ఆయన ర్యాలీ ఏర్పాటు చేసినట్లు మరో వర్గం నేతలు పేర్కొంటున్నారు. అయితే జిల్లా నేతలు మాత్రం జగన్ పర్యటనతో యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది.
వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
నవంబర్ 8, 2008 apems చే
వ్యాఖ్యానించండి