తెలుగుదేశం పార్టీ అంత్యంత ప్రతిష్టాత్మక రీతిలో గుంటూరులో యువగర్జన నిర్వహించింది. ప్రజలు బ్రహ్మాండంగా తరలివచ్చారని తెలుగుదేశం నేతలు ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ప్రజారాజ్యంపార్టీ తిరుపతిలో, కాంగ్రెస్ పార్టీ అనంతపురం, నెల్లూరులలో జరిపిన సభలను మించి జనసమీకరణ చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని దేశం నేతలు ఉత్సాహంగా ఉన్నారు. జనం ఘనంగా వచ్చిన మాట వాస్తవమే. మిగిలిన పక్షాల నేతలు కూడా ఈ సభపై ఏ తరహా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేసినా, జన అంచనాలను మాత్రం తక్కువ చేయడం లేదు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇక తెలుగుదేశం పార్టీకి ఈ సభ నిర్వహణ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు నెరవేరుతాయి? కచ్చితంగా తెలుగుదేశం శ్రేణులలో విశ్వాసం పెరుగుతుంది. అదికార కాంగ్రెస్ పార్టీ మీద, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేదని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్న సందర్భంలో, మరోపక్క చిరంజీవి సభలకు జనప్రవాహం వస్తుందని ప్రజారాజ్యంపార్టీ నేతలు సంభరపడుతున్న నేపధ్యంలో టిడిపి భారీ సభ నడపడం ద్వారా తన సత్తాను చాటుకుంది. తన క్యాడరు చెక్కు చెదరలేదని చెప్పడానికి టిడిపి ఈ ప్రయత్నాన్ని బాగానే వాడుకుంది. కాంగ్రెస్ కు తామే ప్రధాన ప్రత్యర్ధి అన్న భావన కల్పించడానికి, ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత బాగానే ఉందని నిరూపించడానికి ఈ సభ ఉపకరిస్తుంది. అంతేకాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వ పటిమ మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. కేవలం జన సమీకరణ ఒక్కటే విజయానికి సరిపోతుందా అన్నది ఓ ప్రశ్న. అన్ని పార్టీలు భారీ సభలు జరుపుతున్నాయి కదా అన్నసందేహం వెన్నంటే ఉంటుంది. సభల నిర్వహణ అయ్యే వ్యయప్రయాసల సంగతెలా ఉన్నా, వచ్చే ఎన్నికల రంగంలో ధీటుగా నిలబడి అధికారం చేపట్టడానికి సవాలు విసురగలిగిందన్న భావన అయితే వ్యక్తం అయింది. ఈ సభ ద్వారా ఇతర పక్షాలు అంటే టి.ఆర్.ఎస్., వామపక్షాలవారికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంకేతాన్నిఇవ్వగలిగింది. తాను ఎంత బలంగా ఉన్నానో చెప్పగలిగింది. అంతేకాదు. ఎన్.టి.ఆర్.వారసులు తనతో ఉన్నారని చెప్పడం ద్వారా వారి, వారి అభిమానులను తనవైపు తిప్పుకోవడంలో టిడిపి సఫలమైనట్లే. అయితే ఇదే తరుణంలో కేంద్రమంత్రి ఎన్.టి.ఆర్.కుమార్తె పురంధరేశ్వరి బహిరంగ లేఖ రాయడం కాంగ్రెస్ ప్రతి వ్యూహంలో భాగమే. వీటన్నిటికి టిడిపి నేతలు జవాబు చెప్పారుగాని, ఎన్.టి.ఆర్ కుటుంబీకులంతా ఒకేవైపు లేరనడానికి ఆ లేఖ పనికివస్తుంది. ఇక ఉపన్యాసాలు చూస్తే బాలకృష్ణ ప్రసంగం ప్రజల్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ప్రత్యేకించి తాను అన్ని కులాలవాడినని చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఇంతవరకు సభ లక్ష్యం నెరవేరినట్లు కన్పించినా, ఇందులో కొన్ని బలహీనతలు కూడా బయటపడ్డాయని ఒప్పుకోకతప్పదు. ఒకప్పుడు ఒంటిచేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడపగలరని పేరు తెచ్చుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు హరికృష్ణ, బాలకృష్ణ, చివరికి జూనియర్ ఎన్.టి.ఆర్., కళ్యాణరామ్, తారకరత్న వంటి పిన్న వయస్కులపై ఆధారపడడానికి తాపత్రయపడ్డారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఇక హరికృష్ణ గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తారంగా ప్రచారం చేయడానికి సిద్దమైంది. వాటికి హరికృష్ణ జవాబు చెబుతారో లేదో తెలియదు. అంతేకాదు బాలకృష్ణ ఏ విమర్శపడితే ఆ విమర్శ చేయడానికి కుదరదు అన్నట్లుగా బాలకృష్ణ ఇంటిలో కొంతకాలం క్రితం జరిగిన కాల్పుల ఘటనను కాంగ్రెస్ విమర్శనాస్త్రంగా ఎక్కు పెట్టింది వారసత్వం వరంగా ఎక్కువకాలం చెల్లుబాటుకాదు. ప్రతిభ, సామర్ధ్యమే ఏ వ్యక్తికైనా గీటురాళ్ళు అని ఓ ప్రఖ్యాత రచయిత అంటారు. మరి ఈ కొటేషన్ మన రాజకీయాలకు వర్తిస్తుందా అన్నది ప్రశ్న.
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి