నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ విభేదాలు వీధికెక్కుతున్నాయి. నగర మేయర్ ను సొంత పార్టీ నేతలే బయటకు పంపించిన ఘటన మరువక ముందే రెండు వర్గాలు వీధిపోరాటానికి దిగాయి. రాళ్లు రువ్వుకొనే దాకా వెళ్లడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. నెల్లూరు నగరంలో జరిగిన కాంగ్రెస్ పరిరక్షణ సమావేశంలో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వర్గంతో వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్ రెడ్డి వర్గాలకు చెందిన వారు కలబడ్డారు. వాస్తవానికి ఇక్కడి కోవూరు నియోజకవర్గం హస్తం పార్టీకి కంచుకోట అనవచ్చు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన శ్రీనివాసుల రెడ్డికి టికెట్ లభించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే కావటంతో ఆయన వర్గం బలపడుతోంది. ప్రత్యర్థులైన వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్ కలసి కార్యకలాపాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో పరిరక్షణ సమావేశం ఏర్పాటు చేయగాఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు రావటంతో గొడవ చెలరేగింది. చేయి చేసుకొనే దాకా పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేసుకొంటే ఎమ్మెల్యే వర్గీయులు అనవసరపు రగడకు దిగారని ప్రత్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కావటంతో దీనికి హాజరయ్యామని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో పాత్రికేయులకు సైతం గాయాలయ్యాయి.
వ్యాఖ్యానించండి