హైదరాబాద్: తెలంగాణకు సానుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం రాష్ట్ర రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చివేసింది. ఈ నిర్ణయం అధికార కాంగ్రెస్లో గుబులుపుట్టిస్తోందనే చెప్పాలి.
తెలంగాణపై ఇప్పటివరకు “ఆచి తూచి” అడుగులు వేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు “తెలంగాణకు జై” కొట్టడంతో అందరికంటె ఎక్కువగా హర్షించే వ్యక్తి టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. కాగా ఏ “తెలంగాణ” కోసమైతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో పోరాడి, చివరికి బయటకు వచ్చిన దేవేందర్గౌడ్ మాత్రం ఏమంత “గట్టిగా” హర్షం వ్యక్తం చేయలేదు. తెలుగుదేశంపార్టీ “జై తెలంగాణ” అనడం బాగానే ఉన్నా, తెలంగాణ ప్రజలను నమ్మించాలని తెలుగుదేశం పార్టీ చూస్తున్నదని, ఇది తెలంగాణ వాదులు అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరాన్ని సూచిస్తున్నదని దేవేందర్గౌడ్ ఆచి తూచి స్పందించారు.
తెలుగుదేశం పార్టీకి తామంతా రాజీనామా చేసినందువల్లే ఒత్తిడికి లోనై తెలుగుదేశం పార్టీ చివరికి “జై తెలంగాణ” అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నదని దేవేందర్గౌడ్, పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. 2004లో సమైక్య వాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగగా, అప్పుడు “తెలంగాణ” వాదాన్ని అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పాత్రనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోషించదల్చినట్లు కనిపిస్తోందని దేవేందర్గౌడ్ అన్నారు.
ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు “జై తెలంగాణ” అని నినదించిన దృష్ట్యా త్వరలో జరగబోయే రౌండ్టేబుల్ సమావేశానికి తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానిస్తామని దేవేందర్ గౌడ్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించిన అనంతరం వేణుగోపాలాచారి, గుత్తా సుఖేందర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అభినందించారు.