చెన్నై: శ్రీలంకలోని తమిళుల కోసం కరుణానిధి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావాలని ప్రధాన విపక్ష పార్టీలన్నీ నిశ్చయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె, వామపక్ష ద్వయంతో పాటు సంకీర్ణ సర్కారు నుండి బయటికొచ్చిన పిఎంకె కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్ను బాయ్కాట్ చేయాలని నిశ్చయించింది. శ్రీలంకలోని తమిళుల గురించి కేంద్రం సీరియస్గా పట్టించుకోక పోతే మద్దతు ఉప సంహరిస్తామని కరుణానిధి హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకున్నది.
శ్రీలంకలో నివశిస్తున్న తమిళులను ఉగ్రవాదుల పేరిట వేధింపులకు గురి చేయడంతో పాటు నకిలీ ఎన్కౌంటర్లు జరుగుతూ వుండడం పరిస్థితికి అద్దం పడుతున్నదని కరుణ సర్కారు వాదిస్తోంది. అయితే తమిళులకు ఆపన్న హస్తం పేరిట ప్రభుత్వం ఎల్టీటిఇని ప్రోత్సహిస్తోందని కొన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో లంకలోని తమిళుల రక్షణకు ఉద్దేశించి, కరుణానిధి రాజకీయ ఒత్తిడి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు అన్నాడిఎంకె, బిజెపి, వామపక్ష పార్టీలు ఏ మాత్రం కలిసి రావడం లేదు.